TS 10th Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులూ ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..

10th Exams

TS 10th Exams: తెలంగాణలో నేటి నుంచి (సోమవారం) పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు తొలి పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు పరీక్ష ముగుస్తుంది. పరీక్ష హాల్‌లోకి హాజరుకావడానికి 5 నిమిషాలు గ్రేస్‌ టైమ్‌ ఇచ్చారు. అంటే విద్యార్థులను 9.35 గంటల వరకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలవుతుందని, పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. హాల్‌టికెట్లులేని విద్యార్ధులకు పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని తెలిపారు.

ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..

* గ్రేస్‌ టైమ్‌ 5 నిమిషాలు ఇచ్చారు కదా అని ఆలస్యం చేయకుండా.. వీలైనంత ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.

* విద్యార్థులు, సిబ్బంది సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు.

* జవాబుపత్రానికి జతపర్చిన ఓఎంఆర్‌ తనదేనా? కాదా? సరిచూసుకోవాలి. తేదీని కూడా గమనించండి.

* ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ప్రతిపేజీపైనా హాల్‌టికెట్‌ నంబరు రాయాలి.

* జవాబుపత్రం, అడిషనల్‌, బిట్‌, మ్యాప్‌, గ్రాఫ్‌షీట్లలో ఎక్కడా హాల్‌టికెట్‌ నంబరు రాయకూడదు.

* పరీక్షకు వెళ్లే ముందు లైట్‌ ఫుడ్‌ను తీసుకోండి. నూనెతో తయారు చేసిన వాటికి దూరంగా ఉండండి. వెంట వాటర్‌ బాటిల్‌ను తీసుకెళ్లండి.

* పరీక్ష హాల్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయని ప్రశ్నలు కానీ, తప్పుగా రాశామా అన్న ఆలోచన చేయకండి. అది తర్వాతి పరీక్షపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి రాసిన పరీక్షను విడిచిపెట్టి. తర్వాతి పరీక్షకు ప్రిపేర్‌ అవ్వండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/5WsKoud

Baca juga

Post a Comment