Chiranjeevi : నలభై ఏళ్ళ ‘ఇది పెళ్ళంటారా?’

Chiranjeeevi

మెగాస్టార్ చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయనకు అచ్చివచ్చిన నాయికలు మాధవి, రాధిక అనే చెప్పాలి. చిరంజీవి, రాధికతో ‘న్యాయం కావాలి’ చిత్రం నిర్మించిన క్రాంతి కుమార్, ఆ తరువాత వారిద్దరితోనే ‘కిరాయి రౌడీలు’, ‘ఇది పెళ్ళంటారా?’ తెరకెక్కించారు. ‘న్యాయంకావాలి’ సూపర్ హిట్ కాగా, ‘కిరాయి రౌడీలు’ హిట్ అనిపించుకుంది. ‘న్యాయం కావాలి’లో లాగే ‘ఇది పెళ్ళంటారా?’లోని కథాంశం కూడా మహిళా సమస్యపైనే రూపొందింది. 1982 జూలై 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.

‘ఇది పెళ్ళంటారా?’ టైటిల్ ను బట్టే, ఒకరికి జరిగిన పెళ్ళి సరైనది కాదని తెలుస్తోంది. ఇక అసలు కథ ఏమిటంటే – రాధ, పుణ్యమూర్తి భార్య. అతను భర్తననే అహంకారంతో ఆమెను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే, వాడు కట్టిన తాళిని తెంచేసి, చనిపోవాలనుకుంటుంది. అయితే ‘వెలుగు’ పత్రిక పబ్లిషర్ జగన్నాథం ఆమెను రక్షించి, ఇంటికి తీసుకువెళతాడు. ఆయనకు తన కథ చెప్పుకుంటుంది రాధ. ఆమె మనసును మళ్ళించడానికి అన్నట్టు జగన్నాథం, తన దగ్గర పనిచేసే దీపక్ తో రాధను కూడా ఇంటర్వ్యూస్ చేయడానికి పంపిస్తూ ఉంటాడు. ఆడది అబల కాదు అని నమ్మి, మొగుడు లేకపోయినా బతకవచ్చు అని భావించే సువర్ణ ఇంటర్వ్యూతో రాధ, దీపక్ ముందుకు సాగుతారు. కొన్నాళ్ళకు దీపక్, రాధను పెళ్ళి చేసుకుంటానంటాడు. అందుకు జగన్నాథం కూడా చేసుకోమని చెబుతాడు. దీపక్, రాధ పెళ్ళవుతుంది. హాయిగా కాపురం చేసుకుంటూ ఉండగా, రాధ మొదటి మొగుడు పుణ్యమూర్తి వచ్చి, చిచ్చు పెడతాడు. తనతో రాధ పెళ్ళి ఫోటోలు చూపించి, దీపక్ ఆఫీసులో నానా యాగీ చేస్తాడు. దీపక్ వాడికి దేహశుద్ధి చేస్తాడు. తరువాత రాధకు తన వల్ల ఓ బిడ్డ పుట్టిందని, ఆ పాపను చూడాలని లేదా అంటూ ఆమెనూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ పాప ఆ నాడే చచ్చిపోయిందని అన్నా, లేదు ఉందని అంటాడు. ఆ పాపను అడ్డు పెట్టుకొని దీపక్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. పైగా రాధను నానా మాటలు అంటాడు. దాంతో పుణ్యమూర్తిని చంపబోతుంది రాధ. కోర్టులో రాధ కథ విన్న న్యాయమూర్తి, అసలు ఆమెకు పుణ్యమూర్తితో జరిగిన పెళ్ళి పెళ్ళే కాదని, ఆ పరిస్థితుల్లో ఏ ఆడదైనా అలాగే ప్రవర్తిస్తుందని తీర్పునిస్తాడు. పుణ్యమూర్తిని జనం చితక్కొడతారు. పాప, రాధను దీపక్ ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.

అంతకు ముందు ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్స్’ పతాకంపై చిత్రాలు నిర్మించిన క్రాంతికుమార్, ‘న్యాయం కావాలి’ మొదలు ‘శ్రీక్రాంతి చిత్ర’ పతాకంపై సినిమాలు నిర్మించసాగారు. ఆ బ్యానర్ పైనే ఈ సినిమా కూడా రూపొందింది. ఇందులో గొల్లపూడి మారుతీరావు, ప్రభాకర్ రెడ్డి, వుయ్యూరు రామకృష్ణ, సువర్ణ, ఝాన్సీ, పి.జె.శర్మ, చలపతిరావు, భానోజీరావు, మల్లికార్జునరావు, డాక్టర్ భాస్కరరావు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, పాటలు వేటూరి పలికించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులోని “హరి నారాయణ… హరి నారాయణ…”, “వసంతం… శరత్తు…హేమంతం…”, “అమ్మగా…నాన్నగా…”, “నా ఊపిరి నీ పరిమళమా…” అంటూ సాగే పాటలు అలరించాయి.

ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య కో-డైరెక్టర్ గా పనిచేశారు. చిరంజీవి, రాధిక నటించిన నాల్గవ చిత్రమిది. క్రాంతికుమార్ నిర్మించిన చిత్రాల్లో వారిద్దరూ నటించిన మూడవ సినిమా ఇది. మధ్యలో ‘ప్రియ’ అనే చిత్రంలోనూ నటించారు. అంతకు ముందు వారమే విడుదలైన యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ వేవ్ లో ఈ సినిమా ఆట్టే జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత ఈ తరహా కథలతో పలు సినిమాలు తెరకెక్కాయి.



from NTV Telugu https://ift.tt/eqZc1OQ

Baca juga

Post a Comment