Rajendra Kumar: అందరివాడు ‘జూబిలీ’ కుమార్!

Rajendra Kumar Jayanthi Special :
హిందీ చిత్రసీమ స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ టాప్ స్టార్స్ గా వెలుగొందారు. వారి కాలంలోనే
వరుస రజతోత్సవాలతో ‘జూబిలీ కుమార్’ అని పిలిపించుకున్న ఘనుడు రాజేంద్రకుమార్. అనేక విజయవంతమైన చిత్రాలలో హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా, కీ ప్లేయర్ గా నటించి మెప్పించారు రాజేంద్రకుమార్.
రాజేంద్రకుమార్ తులీ 1927 జూలై 20న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. కరాచీలో వీరి కుటుంబం వ్యాపారం చేసేది. దేశవిభజనతో పాకిస్థాన్ లోనే ఆస్తులన్నీ వదిలేసి వచ్చారు రాజేంద్రకుమార్ పెద్దలు. దాంతో రాజేంద్రకుమార్ చిత్రసీమలో ఏదో ఒక పనిచేసుకొని జీవిద్దామని అడుగుపెట్టారు. దర్శకనిర్మాత హెచ్.ఎస్.రావెల్ వద్ద ఐదేళ్ళు అసిస్టెంట్ గా పనిచేశారు. 1949లో రావెల్ తెరకెక్కించిన ‘పతంగ’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు రాజేంద్ర. దిలీప్ కుమార్, నర్గీస్ జంటగా నటించిన ‘జోగన్’లోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాచూసిన దేవేంద్ర గోయెల్ తన ‘వచన్’లో రాజేంద్రకుమార్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించి, రాజేంద్రకు తొలి రజతోత్సవం చూపింది. ‘మదర్ ఇండియా’లో నర్గీస్ కు రాజేంద్రకుమార్, సునీల్ దత్ కొడుకులుగా నటించారు. తరువాతి రోజుల్లో సునీల్ దత్, నర్గీస్ పెళ్ళాడారు. అలాగే ఆ కుటుంబంతో రాజేంద్ర అనుబంధం కొనసాగింది. సునీల్, రాజేంద్ర వియ్యంకులు అయ్యారు.
రాజేంద్రకుమార్ 1959లో నటించిన “గూంజ్ ఉఠీ షెహనాయి” ఘనవిజయం సాధించి, రజతోత్సవం చూసింది. “ధూల్ కా ఫూల్, ఘరానా, దిల్ ఏక్ మందిర్, మేరే మెహబూబ్, ఆయీ మిలన్ కీ బేలా, ఆర్జూ, సూరజ్, జుక్ గయాఆస్మాన్, తలాష్, గన్వార్, గీత్” చిత్రాలు రాజేంద్రకుమార్ ను ‘జూబిలీ కుమార్’గా నిలిపాయి. ఆయన అభినయానికి అవార్డులు లభించక పోయినా, ప్రేక్షకుల రివార్డులు మాత్రం విశేషంగా దక్కాయి. ‘గోరా ఔర్ కాలా’లో ద్విపాత్రాభినయం చేసిన రాజేంద్రకుమార్, ఆ తరువాత కొంతకాలమే స్టార్ గా సాగారు. తరువాతి రోజుల్లో రాజేశ్ ఖన్నా ఆగమనంతో రాజేంద్రకుమార్ చిత్రాలు వరుస పరాజయాలు చూశాయి. వెంటనే రాజేంద్రకుమార్ కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయిపోయారు.
రాజేంద్రకుమార్ కు రాజ్ కపూర్ తో సత్సంబంధాలు ఉండేవి. రాజ్ రూపొందించిన ‘సంగం’లో రాజేంద్రకుమార్ సైడ్ హీరోగా నటించారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. రాజ్ రూపొందించిన ‘మేరా నామ్ జోకర్’లో రాజేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించారు. తరువాత వీరిద్దరూ ప్రధాన భూమికలు పోషించిన “దో జాసూస్” అంతగా అలరించలేకపోయింది. రాజేంద్రకుమార్ తనయుడు కుమార్ గౌరవ్ హీరోగా కొన్ని చిత్రాలలో నటించాడు. బాలీవుడ్ లో అందరివాడుగా ఉన్న రాజేంద్రకుమార్ తన 71వ యేట కన్నుమూశారు. ఇప్పటికీ బాలీవుడ్ లో సక్సెస్ గురించి చర్చ సాగిన ప్రతీసారి ఈ ‘జూబిలీ కుమార్’ను జనం తలచుకుంటూనే ఉండడం విశేషం!
from NTV Telugu https://ift.tt/je1tyT6
Post a Comment
Post a Comment