Soundarya Jayanthi : తెలుగువారిని మురిపించిన సౌందర్య!

Soundarya

Soundarya Jayanthi Special  : సౌందర్య… ఈ పేరు వినగానే ఇప్పటికీ ఎంతోమంది మదిలో వీణలు మోగుతాయి. సౌందర్య అందమైన అభినయం మరపురాకుండా మధురూహలలో పయనించేలా చేస్తుంది. సౌందర్య ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. అలాంటి నేస్తం ఉంటే బాగుంటుందని భావించిన మనసులకూ కొదువలేదు. ఏమయితేనేమి, సౌందర్యను ఆమె మాతృభూమి కన్నడ నేలకన్నా మిన్నగా తెలుగువారు అభిమానించారు.

సౌందర్య అసలు పేరు కె.యస్.సౌమ్య. 1972 జూలై 18న బెంగళూరులో జన్మించారు. సౌందర్య తండ్రి సత్యనారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన రచయితగా, నిర్మాతగా కన్నడ నాట సాగారు. అందువల్ల చదువుల్లో ఎంతో తెలివైన సౌందర్యకు సినిమాల్లో కనిపించాలన్న ధ్యాస కూడా అధికంగా ఉండేది. దాంతో ఎమ్.బి.బి.ఎస్. తొలి సంవత్సరం పూర్తి కాగానే, తన మనసులోని మాటను కన్నవారి ముందు పెట్టింది. అసలే, ఆమె తండ్రి కూడా చిత్రసీమకు సంబంధించిన వారు కావడంతో కూతురు కోరికను కాదనలేకపోయారు. ‘గంధర్వ’ అనే కన్నడ చిత్రంలో తొలిసారి నటించిన సౌందర్య అదే సంవత్సరం తెలుగులో పి.ఎన్.రామచంద్రరావు రూపొందించిన ‘మనవరాలి పెళ్ళి’లో నటించారు. ఆ సమయంలోనే కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘రైతు భారతం’లోనూ ఆమెకు అవకాశం లభించింది. ఆ చిత్రాలు ఆమెకు అంతగా కలసి రాకున్నా, అప్పట్లోనే దర్శకునిగా మారిన ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు “రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, నంబర్ వన్” సౌందర్యకు స్టార్ డమ్ సంపాదించి పెట్టాయి.

సక్సెస్ రూటులో సాగుతున్న సౌందర్యకు టాప్ హీరోస్ తో నటించే ఛాన్స్ దక్కింది. కృష్ణతో ‘నంబర్ వన్’, నాగార్జునతో ‘హలో బ్రదర్’, బాలకృష్ణతో ‘టాప్ హీరో’, వెంకటేశ్ తో ‘సూపర్ పోలీస్’మోహన్ బాబుతో ‘పెదరాయుడు’, చిరంజీవితో ‘రిక్షావోడు’ వంటి చిత్రాలలో నటించేశారామె. వీటిలో కొన్ని బంపర్ హిట్స్ అయ్యాయి. దాంతో సౌందర్యకు జనాల్లో మరింత క్రేజ్ పెరిగింది. తరువాత చిరంజీవితో ‘చూడాలనివుంది, అన్నయ్య’ సినిమాలు సైతం విజయవిహారం చేశాయి.
సౌందర్య ఎందరు హీరోలతో నటించి విజయాలు చూసినా, ఆమె సక్సెస్ రేట్ వెంకటేశ్ తోనే ఎక్కువగా ఉంది. వెంకటేశ్ హిట్ పెయిర్ గా ఆమె జైత్రయాత్ర చేసిందనే చెప్పాలి. “ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా” వంటి వెంకటేశ్ చిత్రాలలో సౌందర్య అందాల అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.

జనం సౌందర్యను ‘మరో సావిత్రి’ అని కీర్తించారు. చీరకట్టులోనే కుర్రకారును కిర్రెక్కించిన సౌందర్య, ‘మరో సావిత్రి’ అన్న పేరు నిలుపుకోవడానికి అభినయప్రాధాన్యమున్న చిత్రాలకే జై కొట్టారు. ఆమె నటించిన పలు కుటుంబకథా చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. తరువాతి రోజుల్లో సౌందర్య చుట్టూ తిరిగే కథలతోనే చిత్రాలు రూపొందడం మొదలయ్యాయి. అందువల్ల టాప్ హీరోస్ సినిమాల్లో సౌందర్య వెలగడం తగ్గింది. కానీ, అప్పట్లో సౌందర్య చిత్రాలను చూడటానికి జనం థియేటర్లకు పరుగులు తీశారు.

విధివశాత్తు సౌందర్య 2004లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్ లో మరణించారు. ఆ ప్రమాదంలో ఆమెకు తొలి నుంచీ అండగా నిలచిన ఆమె అన్న అమర్ కూడా కన్నుమూశారు. ఆమె మరణానికి ముందు బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన ‘నర్తనశాల’లో ద్రౌపది పాత్రలో నటించారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగగానే కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. మొదటి షెడ్యూల్ లో ఎంత చిత్రీకరణ జరుపుకుందో, అంత భాగాన్నీ గత యేడాది ప్యాండమిక్ లో ఏటీటీలో విడుదల చేశారు బాలకృష్ణ. అలా సౌందర్య చివరి చిత్రంగా ‘నర్తనశాల’ నిలచింది. ఏది ఏమైనా సౌందర్య అందాల అభినయాన్ని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరు. బుల్లితెరపై సౌందర్య చిత్రాలు ప్రదర్శితమవుతున్న సమయంలో ఆ నాటి అభిమానులు ఆమె అభినయాన్ని చూసి ఇప్పటికీ పరవశించి పోతూనే ఉన్నారు



from NTV Telugu https://ift.tt/GZqYl8r

Baca juga

Post a Comment