Twenty Years For Indra Movie: ఇరవై ఏళ్ళ ‘ఇంద్ర’

Twenty Years For Indra Movie :మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబోలో రూపొందిన ‘ఇంద్ర’ చిత్రం ఇరవై ఏళ్ళ క్రితం సంచలన విజయం సాధించింది. ఈ నాటికీ చిరంజీవి ఫ్యాన్స్ కు మరపురాని చిత్రాలలో ఒకటిగా ‘ఇంద్ర’ నిలచే ఉంది. ఈ చిత్రంతోనే చిరంజీవి, అశ్వనీదత్ కాంబినేషన్ ‘హ్యాట్రిక్’ సాధించింది. అప్పట్లో రజతోత్సవాలలో ‘ఇంద్ర’ ఓ రికార్డు నెలకొల్పింది. ఇలా పలు విశేషాలకు కేంద్రంగా నిలచిన ‘ఇంద్ర’ చిత్రం 2002 జూలై 24న విడుదలై విజయఢంకా మోగించింది.
‘ఇంద్ర’ సినిమాకు ముందు దర్శకుడు బి.గోపాల్ రూపొందించిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాలు ఫ్యాక్షనిజానికి హీరోయిజం అద్దిన చిత్రాలుగా నిలిచాయి. ఆ రెండు సినిమాల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. ఆ సంచలన విజయాల తరువాత చిరంజీవి కూడా ఫ్యాక్షనిజమ్ బ్యాక్ డ్రాప్ కథపై ఆసక్తి చూపించడం, ఆ రెండు సినిమాలకు రచన చేసిన పరుచూరి బ్రదర్స్ ‘ఇంద్ర’కూ మాటలు సమకూర్చడం జరిగింది. ఇక ‘నరసింహనాయుడు’కు కథ అందించిన చిన్నికృష్ణనే ‘ఇంద్ర’కు కూడా కథను రూపొందించడం విశేషం!
ఇంతకూ ‘ఇంద్ర’ కథ ఏమిటంటే – కక్షలతో కాగిపోతున్న రాయలసీమలో శాంతి నెలకొనాలని భరతసింహారెడ్డి తండ్రి భావిస్తాడు. కానీ, కొండారెడ్డి అతడిని వెన్నుపోటుపొడిచి చంపేస్తాడు. సీమలో ముఠాకక్షలు సమసిపోవాలంటే ఈ రెండు కుటుంబాలు కలవాలని పోలీస్ అధికారి చెబుతాడు. అతని మాటలు విని, కొండారెడ్డి కూతురును భరతసింహారెడ్డి తమ్ముడు విజయసింహారెడ్డి పెళ్ళి చేసుకుంటాడు. శోభనం రాత్రి పాలలో విషం కలిపి, కొండారెడ్డి కూతురు తాను తాగి, భర్తకూ తాగించి చచ్చేలా చేస్తుంది. కొండారెడ్డి కొడుకు శివారెడ్డి, భరతసింహారెడ్డిని చంపేస్తాడు. దాంతో వారివైపు పెద్ద దిక్కులేకుండా చేశానని గర్వంతో శివారెడ్డి జైలుకు పోతాడు. పెద్దదిక్కులేని తమ వర్గానికి ఆధిపత్యం ఎవరూ వహించడానికి ముందుకు రారు. దాంతో భరతసింహారెడ్డి తనయుడు ఇంద్రసేనా రెడ్డి బాలుడైనా కుర్రీలో కూర్చుని తొడకొడతాడు. కాశీలో శంకరనారాయణ టాక్సీ డ్రైవర్. అందరికీ మేలు చేయాలని తపించేగుణం అతనిది. గవర్నర్ చెన్నకేశవ రెడ్డి కూతురు పల్లవి కాశీలో నృత్యం నేర్వాలని వస్తుంది. ఆమె నీట మునక వేయగా, ఆమె హారం కొట్టుకువచ్చి శంకర్ నారాయణకు దొరుకుతుంది. శంకర్ మెడలో ఆ హారాన్ని చూసిన పల్లవి, అతని మేనకోడలు ద్వారా అతని ఇంట చేరి అక్కడే ఉంటుంది. శంకర్ పై మనసు పారేసుకుంటుంది. కాలేజ్ లో ఉండవలసిన కూతురు ఓ టాక్సీవాలా ఇంట్లో ఉందని తెలిసి, చెన్నకేశవరెడ్డి తన భద్రతా సిబ్బందితో శంకర్ ఇల్లు చుట్టుముడతాడు. అక్కడ శంకర్ ను చూసి, గవర్నర్ రెండు చేతులు ఎత్తి అతనికి నమస్కారం చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. శంకర్ మేనకోడలు లాంచీ నడిపే గిరిని ప్రేమిస్తుంది. వారి పెళ్ళి చేశాకే తాను వివాహం చేసుకోవాలనుకుంటాడు శంకర్. అప్పుడు స్నేహలతా రెడ్డి వచ్చి, ఆ పెళ్ళి ఆపు చేస్తుంది. పెళ్ళికొడుకు గిరి అసలు పేరు వీరమనోహర్ రెడ్డి అని, అతడు తన మేనల్లుడు అని చెబుతుందామె. అప్పుడే శంకర్ ను ఆమె ‘ఇంద్ర’ పేరుతో సంబోధిస్తుంది. శంకర్ ఆశ్చర్యపోతాడు. అప్పటి దాకా మూగవాడుగా నటిస్తున్న శంకర్ అనుచరుడు వాల్మీకి నోరు తెరచి ఇంద్ర గతాన్ని చెబుతాడు. శంకర్ అసలు పేరు ఇంద్రసేనారెడ్డి అని, రాయలసీమ కోసం యావదాస్తినీ ఇచ్చిన ధర్మాత్ముడని చెబుతాడు. తరువాత ఇంద్ర సీమవాసుల కోసం మళ్ళీ జన్మస్థలానికి వెళతాడు. అక్కడ ఇంద్రసేనను మట్టుపెట్టాలని శివారెడ్డి, అతని తనయులు పలు ప్రయత్నాలు చేస్తారు. చివరకు వారిని చిత్తు చేసి, చంపే అవకాశం చిక్కినా, కత్తిని వదిలేస్తాడు ఇంద్ర. ఇలా ఎన్నాళ్ళని చంపుకుంటూ పోతాం. ముగింపు పలకాలని వారిని వదిలేస్తాడు. ఇంద్ర మంచితనం చూసి స్నేహలత కూడా కరిగిపోతుంది. చివరకు తనతో కాశీకి రమ్మని పల్లవి, తన మెడలో తాళి కట్టమని స్నేహలత కోరుతూ ఉండగా, జనం వచ్చి ఇంద్ర ఇంటిముందు నుంచుని తమను వదలి ఎక్కడకూ వెళ్ళొద్దని కోరతారు. “నేను మీ మనిషిని… మీ కోసమే పుట్టాను…” అని ఇంద్ర అనడంతో కథ ముగుస్తుంది.
వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ నాయికలుగా నటించారు. మిగిలిన పాత్రల్లో రాజా మురాద్, ప్రకాశ్ రాజ్, శివాజీ, తనికెళ్ళ భరణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, సునీల్, తెలంగాణ శకుంతల, రజిత, ఇళవరసి, వినయ ప్రసాద్, పునీత్ ఇస్సార్, ఆహుతి ప్రసాద్, సమీర్, పావలా శ్యామల, నర్రా వెంకటేశ్వరరావు, సుధాకర్ నాయుడు, రాజా రవీంద్ర, లహరి, రాణి, శివకృష్ణ, మాస్టర్ తేజ, మాస్టర్ ఆనంద్ కనిపించారు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా, వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, కులశేఖర్ పాటలు పలికించారు. ఇందులోని “భం భం బోలే…”, “ఘల్లు ఘల్లుమని…”, “దాయి దాయి దామ్మా…”, “రాధే గోవిందా…”, “అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో….”, “అమ్మడూ అప్పచ్చి…” అంటూ సాగే పాటలు అలరించాయి. ముఖ్యంగా ఇందులోని “దాయి దాయి దామ్మా…” పాటకు చిరంజీవితో లారెన్స్ చేయించిన ‘వీణ స్టెప్’ అప్పట్లో విశేషాదరణ చూరగొంది. తరువాతి రోజుల్లో ఆ స్టెప్ ను అనుకరిస్తూ కొందరు, పేరడీ చేసి కొందరు వినోదం పంచారు.
ఈ సినిమాతో హీరో చిరంజీవి, నిర్మాత అశ్వనీదత్ ‘హ్యాట్రిక్’ చూశారు. అంతకు ముందు చిరంజీవితో దత్ నిర్మించిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, ‘చూడాలనివుంది’ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక దర్శకుడు బి.గోపాల్ కు కూడా చిరంజీవితో ‘ఇంద్ర’ మూడో సినిమా. అంతకు ముందు వారిద్దరి కాంబోలో ‘స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు’ వచ్చాయి. ఆ సినిమాల కన్నా మిన్నగా ‘ఇంద్ర’ ఘనవిజయం సాధించింది.
‘ఇంద్ర’ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. అనేక కేంద్రాలలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ చూసింది. 122 కేంద్రాలలో శతదినోత్సవం , 32 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని అప్పట్లో రికార్డుగా నిలచింది. ఆదోని సత్యం థియేటర్ లో 247 రోజులు ప్రదర్శితమైంది. ఈ సినిమా ద్వారా చిరంజీవికి ఉత్తమనటునిగా నంది అవార్డు లభించింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా లారెన్స్ కు, బెస్ట్ డబ్బింగ్ మేల్ ఆర్టిస్ట్ గా రవిశంకర్ కు నంది అవార్డులు దక్కాయి. ఈ చిత్రం ‘ఇందిరన్’ పేరుతో తమిళంలోనూ, ‘ఇంద్ర: ద టైగర్’ టైటిల్ తో హిందీలోనూ, ‘ఇంద్ర – ఏక్ షేర్’ పేరుతో భోజ్ పురిలోనూ అనువాదమయింది. బెంగాలీలో 2005లో ‘దాదా’గా రీమేక్ అయింది, 2006లో బంగ్లాదేశీ బెంగాలీలో ‘గోరిబర్ దాదా’నూ నిర్మించారు.
from NTV Telugu https://ift.tt/DmG3bhR
Post a Comment
Post a Comment