Forty Years For Swayamvaram Movie : నలభై ఏళ్ళ ‘స్వయంవరం’

Swayamvaram

Forty Years For Swayamvaram Movie
మనసు ఒకరికి, మనువు ఒకరితో అంటూ ఎంతోమంది అమ్మాయిలు కన్నవారి కోసం కోరుకున్నవారిని కాదనుకున్న సందర్భాలు ఉన్నాయి. కొందరు సర్దుకుపోతుంటారు, మరికొందరు నలిగిపోతూనే ఉంటారు. అమ్మాయిల మనసునూ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పంతాలు పట్టింపులు వదిలేయాలి అంటూ నీతులు చెబుతూ ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే తీరున సాగి, కాసింత వైవిధ్యాన్ని మిళితం చేసి దాసరి నారాయణరావు ‘స్వయంవరం’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా 1982 ఆగస్టు 6న విడుదలై విశేషాదరణ చూరగొంది.

ఇంతకూ ‘స్వయంవరం’ కథ ఏమిటంటే – అగ్నిప్రమాదానికి గురై భార్య చనిపోతోందని తానూ చావాలనుకుంటాడు సుబ్బారావు, కానీ అతడిని బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ధర్మారావు అతనిని ఆ ప్రయత్నం నుండి విరమింపచేసి ఇంటికి తీసుకువెళతాడు. ధర్మారావుకు ఓ కొడుకు చంద్రశేఖర్, సుబ్బారావుకు ఓ కూతురు ప్రియ ఉంటారు. ధర్మారావు తన భార్య చేతి గాజులు అమ్మి టీ కొట్టు పెడతాడు. అందులోనే సుబ్బారావు పనిచేస్తూంటాడు. చందు, ప్రియ చిన్నప్పుడే ఓ పెళ్ళిలో దంపతులను చూసి, తామూ ఎన్నడూ విడిపోకూడదని పెళ్ళి చేసుకుంటారు. వారిని కన్నవారు కూడా ఆశీర్వదిస్తారు. ధర్మారావు, సుబ్బారావు కలసి కోట్లు సంపాదిస్తారు. కానీ, వాళ్ళ మేనేజర్ కారణంగా వారి మధ్య చిచ్చు రగులుతుంది. వ్యాపారంలో ధర్మారావుని, సుబ్బారావు మోసం చేస్తాడు. ధర్మారావు వాటాకు నష్టాలు చూపిస్తాడు. ధర్మారావు పరిస్థితి తారుమారవుతుంది. ఓడలు బండ్లు కాగానే సుబ్బారావు మాట మారుస్తాడు. చందు, ప్రియ మధ్య అతనే అగాథం సృష్టిస్తాడు. తరువాత కూతురును బలవంతంగా రాజశేఖర్ అనే ధనవంతునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అతనికి పలు వ్యసనాలు ఉంటాయి. పెళ్ళయితే బాగుపడతాడనే తల్లి అతనికి వివాహం చేస్తుంది. చందు పిచ్చివాడయి తిరుగుతూ ఉంటాడు.

అతను ఓ రోజు వానలో పాటలు పాడుకుంటూ ఉండగా, శేఖర్ అది చూసి, అతడిని చేరదీస్తాడు. అక్కడ ప్రియను చూసి షాక్ అవుతాడు చందు. కొన్నాళ్ళకే రాజశేఖర్ కు, చందు అలా పిచ్చివాడు కావడానికి తన భార్యను ప్రేమించడం కారణమని తెలుస్తుంది. వారి ప్రేమను అర్థం చేసుకొని, వారిని ఒకటిగా చేసే ప్రయత్నం చేస్తాడు. తాను ప్రియను వదిలేస్తే ఏం చేస్తావ్ అని ఓ సారి చందును, శేఖర్ అడుగుతాడు. తాను పెళ్ళి చేసుకుంటానంటాడు చందు. వారిద్దరూ ఒకటి కాకుండా మోసం చేసిన సుబ్బారావును పిలచి, నిజాలు తేలుస్తాడు శేఖర్. ప్రియను చందును ఒకటి చేయాలనుకుంటాడు. అందుకు ప్రియ తండ్రి సుబ్బారావు అంగీకరించడు. పెళ్ళయిన తరువాత భార్యపై భర్తకే అన్ని అధికారాలు ఉంటాయని, ఆమెను కోరుకున్నవాడికి ఇచ్చి పెళ్ళి చేయడం కూడా తన ధర్మమే అని శేఖర్ అంటాడు. ప్రియ వద్దంటుంది. ఆడదానికి తాళి వేసేది ఒక్కసారే, తీసేది ఒక్కసారే అని చెబుతుంది. దాంతో శేఖర్ ఆత్మాహుతి చేసుకుంటాడు. తాను కన్నుమూస్తూ ఓ ఉత్తరాన్ని చందుకు ఇస్తాడు. అందులో “సంప్రదాయాలు మంచివే, కానీ వాటివల్ల జీవితాలు నాశనం కాకూడదని చందును చేసుకొని సుఖంగా ఉండమని కోరతాడు. ఒకవేళ సంప్రదాయమే గొప్పదనుకుంటే, ఏలాంటి కల్మశం లేని పసితనంలోనే పెళ్ళాడిన మీదే అసలైన పెళ్ళి, నాదే రెండో పెళ్ళి” అనీ రాసివుంటుంది. దాంతో కథ ముగుస్తుంది.

శోభన్ బాబు, జయప్రద, గుమ్మడి, రావు గోపాలరావు, అంజలీదేవి, రమాప్రభ, పుష్పలత, రూపాచక్రవర్తి, సత్యచిత్ర, గౌరి, బేబీ మీనా, మాస్టర్ పురుషోత్తం, మాస్టర్ ఫణికుమార్ నటించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు విలక్షణమైన పాత్రలో అభినయించారు.
లక్ష్మీ గణేశ్ చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని డి.రామరాజు, డి.విజయరామరాజు నిర్మించారు. ఈ చిత్రానికి సత్యం స్వరకల్పన చేయగా, రాజశ్రీ, దాసరి పాటలు పలికించారు. ఈ సినిమా దాసరి నారాయణరావు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పేరు తలచుకోగానే ఈ నాటికీ ఇందులో ఏసుదాస్ గానం చేసిన “గాలివానలో వాననీటిలో…” అనే పాటనే ముందుగా గుర్తుకు వస్తుంది. “నేనిక్కడ…నువ్వక్కడ…”, “ఆకాశం ఎందుకో…”, “ముసుగేసిన మబ్బుల్లో…” అంటూ సాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది.

ఈ కథలోని ముగింపుతోనే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘కన్యాదానం’ తెరకెక్కింది. అయితే, అందులో చనిపోవడాలేవీ లేకుండా తాను పెళ్ళి చేసుకున్న అమ్మాయి మరొకరిని ప్రేమించిందని తెలియగానే, భర్తగా తన భార్యను ఎవరికైనా ఇచ్చే అధికారం ఉందని ఆమె కోరుకున్నవాడితో పెళ్ళి జరిపిస్తాడు హీరో. ఇక దాసరి ‘స్వయంవరం’ టైటిల్ తోనే తరువాతి రోజుల్లో వేణు హీరోగా ఓ చిత్రం రూపొందింది. ఆ సినిమాతోనే దర్శకుడు కె.విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ మంచి గుర్తింపు సంపాదించడం విశేషం!



from NTV Telugu https://ift.tt/SpbKhfq

Baca juga

Post a Comment