Congress: కాంగ్రెస్ లో ఎన్నికల కోలహలం.. నేడే నోటిఫికేషన్.. పోటీలో ఉండేది వీరేనా..

Congress: కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలహలం మొదలైంది. మరో నెల రోజుల లోపే హస్తం పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరనేది తేలిపోనుంది. అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకోవాలని నిర్ణయించడం, మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి వద్దంటూ రాహుల్ గాంధీ భీష్మించుకు కూర్చోవడంతో తొలిసారిగా గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలకనేతల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ సెప్టెంబర్ 22వ తేదీ గురువారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల అవుతుంది. పార్టీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించాలని, అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుమతి అవసరం లేదని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా… సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 17వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తైన రెండు రోజుల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
నోటిఫికేషన్ విడుదల కానుండటంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోరుకుంటే అధ్యక్ష పదవికి నామపత్రాలు దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ తెలిపారు. పార్టీ ఇచ్చిన ఏ బాధ్యత అయినా నెరవేర్చుతానని ఇప్పటికే తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీన అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. మరో వైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను యువ నేత రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు కోరుతున్నారు. దీనిలో భాగంగా చాలా రాష్ట్రాలు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాయి.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తుందని… మళ్లీ రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఇదే మంచి సందర్భమని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పేర్కొన్నారు. నేతలంతా రాహుల్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారనేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/jQF9hCr
Post a Comment
Post a Comment