IND vs SA: ఇండోర్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. ఆఖరి టీ20లో సఫారీలదే గెలుపు.. సిరీస్‌ భారత్‌ వశం

India Vs South Africa

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలన్న టీమిండియా కల నెరవేరలేదు. ఇండోర్‌లో జరిగిన ఆఖరి టీ20లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో భారతజట్టుపై విజయం సాధించింది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత్‌కు 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. దినేశ్ కార్తీక్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. అజేయ సెంచరీతో చెలరేగిన రిలే రస్సో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపిక కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును గెల్చుకున్నాడు.

సమష్ఠి వైఫల్యంతో..

కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్లు, బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆరుగురు భారత బ్యాటర్లు రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ రూపంలో టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. విరాట్‌ కోహ్లీ స్థానంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్ 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. కుదుపునకు గురైన ఇన్నింగ్స్‌ను రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ హ్యాండిల్ చేసేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ కూడా కొన్ని మంచి షాట్లు ఆడారు. కానీ భారీ స్కోరు చేయలేకపోయారు. పంత్ (27), కార్తీక్ ఔటయ్యాక టీమిండియా పేకమేడలా కూలిపోయింది. గత 2 మ్యాచ్‌ల్లో వరుసగా 2 అర్ధ సెంచరీలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ మూడో మ్యాచ్‌లో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అక్షర్ పటేల్ కూడా విఫలమయ్యాడు. అయితే దీపక్ చాహర్ చివరి ఓవర్లలో 17 బంతుల్లో 31 పరుగులు చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.

డికాక్, రస్సో షో..

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బావుమా 3 పరుగుల వద్ద ఔటైనా.. క్వింటన్ డి కాక్, రిలే రస్సో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. డి కాక్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. 120 పరుగుల వద్ద డికాక్ రనౌటైనా రస్సో మరింత చెలరేగాడు. స్టబ్స్, మిల్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను 227 పరుగులకు తీసుకెళ్లాడు. రూసో తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. అతని తుఫాను ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు మరియు 8 సిక్సర్లు ఉన్నాయి. స్టబ్స్ 18 బంతుల్లో 23 పరుగులు చేయగా.. గత మ్యాచ్లో అజేయ సెంచరీ చేసిన డేవిడ్ మిల్లర్ మరోసారి చెలరేగాడు. కేవలం 5 బంతుల్లో 3 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/Oi5MgUX

Baca juga

Post a Comment