Off The Record: సెగలు రాజేస్తున్న మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయం.. ఆఫీసులోనే నేతలు ఘర్షణ..!

Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్లో చాలాకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. పరస్పరం పోలీస్లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన గొడవగా కార్యకర్తలు భావించడం లేదట. కొంత కాలంగా లక్ష్మారెడ్డి మిర్యాలగూడ టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు లక్ష్మారెడ్డి. అయితే టికెట్ రేస్లోకి మరికొందరు రావడంతో కాంగ్రెస్ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి
మిర్యాలగూడలో కొద్దిరోజులుగా జరుగుతున్న గొడవలను ఉత్తమ్, జానారెడ్డిల దృష్టికి లోకల్ లీడర్స్ తీసుకెళ్లారట. ఎవరొచ్చినా వారు వింటున్నారే తప్ప పరిష్కరించడం లేదని కేడర్ మాట. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడి.. తర్వాత కాంగ్రెస్లో చేరిన అమరేందర్రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనకు జానారెడ్డి ఆశీసులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే జానారెడ్డే మిర్యాలగూడ సీటును తన కుమారుడి కోసం అడుగుతున్నారనే వాదనా ఉంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కేంద్రంగా వివాదాలు జరుగుతున్నాయని.. ఆయన జానారెడ్డికి అత్యంత సన్నిహితుడనేది లక్ష్మారెడ్డి ఆరోపణ. జానారెడ్డి మిర్యాలగూడలో తన కుమారుడికి లైన్ క్లియర్ చేసుకునేందుకే పార్టీలో గొడవలు సృష్టిస్తున్నారనేది మరో విమర్శ. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో జానారెడ్డి కీలక పాత్ర పోషిస్తారని.. అందుకే ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఆయనకు తెలియకుండా జరుగుతాయా అనేది పార్టీ వర్గాల ప్రశ్న. లక్ష్మారెడ్డి వర్గం ఈ అంశాన్నే బలంగా వినిపిస్తోంది. అయితే లక్ష్మారెడ్డి వర్గం చేస్తున్న ఈ వాదనను జానారెడ్డి వర్గం ఖండిస్తోంది. మొత్తానికి వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ మిర్యాలగూడ కాంగ్రెస్లో జూనియర్ వర్సెస్ సీనియర్ రగడ రానున్న రోజుల్లో మరింత పీక్స్కు వెళ్తుందని అనుకుంటున్నారు.
from NTV Telugu https://ift.tt/nXlEc69
Post a Comment
Post a Comment