Off The Record: లెఫ్ట్ పార్టీల మధ్య ఇన్నాళ్లు వైరం.. ఇక కలిసి పనిచేయాలని నిర్ణయం


Off The Record: తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టుల రూటే సపరేటు. సిపిఐ , సిపిఎం మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. 2018 ఎన్నికల్లో ఆ వైరంతోనే చెరో పక్షాన్ని ఎంచుకున్నాయి. సిపిఎం… బిఎల్ఎఫ్ ప్రయోగం చేసింది. సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. చివరికి రెండు పక్షాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రయోగానికి తెర లేపాయి రెండు పార్టీలు. విధానపరమైన వైరం కొనసాగుతున్నా..కలిసి ఉద్యమాలు చేశాయి రెండు పక్షాలు. కానీ ఎన్నికల్లో కలిసి పని చేయలేకపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఉభయ కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రెండు పార్టీలకు చెందిన మండల, జిల్లా స్థాయి నాయకులతో సమ్మేళనం నిర్వహించబోతున్నారు.
సిపిఐ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉంది. సిపిఎంకు ఉమ్మడి ఖమ్మంలో బలమైన క్యాడర్ ఉంది. కానీ ఈ రెండు జిల్లాల్లో రెండు పార్టీల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైరం కంటే ఉభయ కమ్యూనిస్టుల మధ్య రాజకీయ ఘర్షణలు గతంలో ఎక్కువగా జరిగాయి. రెండు పార్టీలు ప్రత్యర్ధులుగా దాడులు చేసుకున్న చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఇలాంటివన్నీటిని పక్కనపెట్టి ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈసారి ఎన్నికల్లో బిజెపిని కట్టడి చేయాలని ఉభయ కమ్యూనిస్టులు కలిశారట. అయితే బలమైన క్యాడర్ ఉన్న నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో కలహాలను మర్చిపోతారా? క్షేత్రస్థాయిలో నాయకులంతా ఉమ్మడిగా పని చేయగలుగుతారా? అందుకు ఆదివారం నిర్వహించే ఉభయ కమ్యూనిస్టుల సమ్మేళనం కలిసి వస్తుందా? అనే కొత్త చర్చ మొదలైంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శుల మధ్యనే విభేదాలు ఉండేవి. అప్పట్లో సిపిఎం రాఘవులుకి… సిపిఐ నారాయణకి పెద్దగా పొసిగేది కాదు. అందులో భాగంగానే 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన నారాయణను సిపిఎం ఓడించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సిపిఎం కార్యదర్శి తమ్మినేనిపై కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు నారాయణ. సిపిఐకి.. సిపిఎం వెన్నుపోటు పొడిచిందని చెప్పుకొచ్చారాయన. కానీ తాజాగా దీనిపై తమ్మినేని వీరభద్రం స్పందించారు. 2014 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్లు కలిసి పని చేయలేదని… అప్పట్లో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చామని వివరించారు. సిపిఎంపై నారాయణ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తప్పన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. విధానపరమైన అంశాలతో పాటుగా రాజకీయ విభేదం కూడా ఉభయ కమ్యూనిస్టుల మధ్య ఉంది. దీనిమీద ఆదివారం జరిగే ఉమ్మడి సమ్మేళనంలో చర్చిస్తారా? సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య అవగాహన కుదురుతుందా ? ఇలాంటివన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి.
తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు చీలికలు పేలికలుగా విడిపోతున్నాయి. న్యూ డెమోక్రసీ, పీడీఎస్యూల్లో చీలికలను చూసిన పెద్దన్నలు ప్రస్తుతం కలిసి పనిచేయాలని ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం కలిసి పనిచేయడం ఓకే అయితే…వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఎవరితో కలుస్తారన్నది బిగ్ క్వశ్చన్. ఇప్పటికైతే బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు టచ్ లో ఉన్నారు. ఇది కొనసాగుతుందా ? సీట్ల సర్దుబాటు విషయంలో బీఆర్ఎస్ దిగి వస్తుందా? భవిష్యత్తు బంధం ఎలా ఉంటుందన్న క్లారిటీ రావాల్సి ఉంది. వీళ్ళిద్దరూ ఎవరితో కలుస్తారనేదాని కంటే ఇద్దరి మధ్య రాజకీయ వైరం తొలగిపోతుందా లేదా అనేది చూడాలి. !?
from NTV Telugu https://ift.tt/brW1GZg
Related Posts
- Twenty Years For Indra Movie: ఇరవై ఏళ్ళ ‘ఇంద్ర’
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Sixty Years For Mahamantri Timmarusu: అరవై ఏళ్ళ ‘మహామంత్రి తిమ్మరుసు’
- D. Madhusudhana Rao Jayanthi: అలరించిన ‘అన్నపూర్ణ’ అధినేత దుక్కిపాటి
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- IND Vs WI: దుమ్మురేపిన అక్షర్ పటేల్.. వన్డే సిరీస్ టీమిండియా కైవసం
Post a Comment
Post a Comment