25 Years Of Paradesh: పాతికేళ్ల షారుఖ్ ఖాన్ ‘పర్ దేశ్’

Parades Movie

పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హవా విశేషంగా వీస్తోంది. షారుఖ్ నటించిన సినిమా వస్తే చాలు, కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ భావించేవారు. దక్షిణాదిన సైతం షారుఖ్ చిత్రాలు వసూళ్ళు విశేషంగా సాధించేవి. పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ‘పర్ దేశ్’ సినిమా సైతం విజయపథంలో సాగింది. సుభాష్ ఘయ్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పర్ దేశ్’ సినిమా 1997 ఆగస్టు 8న విడుదల విజయభేరీ మోగించింది.

‘పర్ దేశ్’ కథ ఏమిటంటే – కిశోరీలాల్ తన కొడుకు రాజీవ్ కు తన మిత్రుని కూతురు గంగను ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అందుకు కిశోరీలాల్ పెంచి పెద్ద చేసిన అర్జున్ ఏర్పాట్లు చేస్తుంటాడు. అయితే అతను చేసే పనులు పెళ్ళికూతురు గంగకు, ఆమె ఇంట్లోవాళ్లకు నచ్చవు. గొడవ మొదలవుతుంది.

తరువాత అర్జున్, గంగ మధ్య స్నేహం పెరుగుతుంది. రాజీవ్ వచ్చాక అతని పాశ్చాత్య పోకడలు చూసి గంగ ఆశ్చర్యపోతుంది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన గంగకు రాజీవ్ చేష్టలు ఏ మాత్రం నచ్చవు. రాజీవ్ తనతో గంగను లాస్ వెగాస్ తీసుకు పోతాడు. అక్కడే పెళ్ళికి ముందే ఒక్కటవుదామని గంగను బలవంత పెడతాడు రాజీవ్. చీదరించుకొని వెళ్ళిపోతుంది గంగ. రాజీవ్ ఆమెను వద్దనుకుంటాడు. ఆమె పరిస్థితి చూసి అర్థం చేసుకున్న అర్జున్ సహాయపడతాడు. దాంతో గంగ, అర్జున్ తో లేచిపోయిందనీ రాజీవ్ గంగ కుటుంబసభ్యులకు చెబుతాడు.

తన తండ్రి పెంచి పెద్ద చేసిన అర్జున్, గంగకు సహకరించడం రాజీవ్ కు ఏ మాత్రం నచ్చదు. గంగను అర్జున్ వారి కుటుంబసభ్యుల దగ్గరకు చేరుస్తాడు. అర్జున్ ను చంపడానికి గూండాలనూ నియమిస్తాడు రాజీవ్. అర్జున్, రాజీవ్ కొట్టుకుంటారు. కిషన్ లాల్ కు అసలు విషయం తెలుస్తుంది. తాను గంగను ప్రేమించినా, ఏ రోజూ ఆ మాట చెప్పలేదన్న నిజాన్ని అర్జున్ చెబుతాడు. కిశోరీలాల్ కూడా గంగ తన కోడలు కావాలనుకున్నానని, అయితే రాజీవ్ భార్యగా కాదు, అర్జున్ కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేయాలని అంటాడు. అర్జున్, గంగ ఒకటి కావడంతో కథ సుఖాంతమవుతుంది.

నటి మహిమాచౌధురి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘పర్ దేశ్’. ఇందులో అమ్రిష్ పురి, అపూర్వ అగ్నిహోత్రి, అలోక్ నాథ్, పద్మావతీ రావ్, దినా పాథక్, హిమానీ శివ్ పురి, మాధురీ భాటియా, స్మితా జయకర్, పవన్ మల్హోత్రా, ప్రాచీ సావే,ఆదిత్య నారాయణ్, సమతా సాగర్ నటించారు. ఓ పాటలో పాడుతూ సుభాష్ ఘయ్ కూడా కనిపిస్తారు. నదీమ్ -శ్రవణ్ స్వరకల్పనకు ఆనంద్ బక్షీ పాటలు రాశారు. ఇందులోని “నహీ హోనా థా…”, “మేరీ మెహబూబా…”, “యే దిల్ దీవానా…”,”ఐ లవ్ మై ఇండియా…”, “దో దిల్ మిల్ రహే హై…”, “జహా పియా వహా మై…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. 1997 బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ‘పర్ దేశ్’ నిలచింది. ఈ సినిమా తరువాత మహిమా ఛౌదురి తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘మనసులో మాట’లో నాయికగా నటించింది.

(ఆగస్టు 8న ‘పర్ దేశ్’కు 25 ఏళ్ళు)



from NTV Telugu https://ift.tt/IJzX2me

Baca juga

Post a Comment