Hyderabad: క్యూ నెట్‌ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. కొరడా ఝుళిపించిన ఈడీ..

Enforcement Directorate

క్యూ నెట్‌ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కంపెనీకి చెందిన రూ. 137 కోట్లు ఫ్రీజ్ చేసింది ఈడీ. క్యూనెట్ కుంభకోణంలో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ, దాని ప్రమోటర్లకు చెందిన 137 కోట్ల రూపాయల నగదు నిల్వలను ఫ్రీజ్‌ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూనిట్ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిందితులు కలిగి ఉన్న 58 బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది.

హైదరాబాద్, బెంగళూరులో క్యూనెట్ స్కామ్‌కు సంబంధించిన ఆఫీసుల్లో ఈడీ ఈ మధ్యే సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, బెంగళూరులో 8 భవనాలను జప్తు చేసింది. సైబరాబాద్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఈమేరకు హైదరాబాద్ విభాగం ఈడీ చర్యలు తీసుకుంది. విహాన్, దాని ప్రమోటర్లపై సైబరాబాద్ పోలీసులు 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం తర్వాత గతంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది.

క్యూనెట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీలో జరిగిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ అనే ఆరోపణలున్నాయి. క్యూ1 గ్రూప్ యాజమాన్యంలో హాంకాంగ్ ఆధారిత మల్టీ-లెవల్ మార్కెటింగ్ కంపెనీకి విహాన్ లింక్ అయి ఉంది. కంపెనీ అనేక పోంజీ స్కీమ్‌లు, బైనరీ స్కీమ్‌లు, ప్రోడక్ట్ బేస్డ్, వెకేషన్ ప్యాకేజీలు, వ్యాపార వ్యూహాలలో పాల్గొంటున్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా క్యూనెట్‌పై మొత్తం 38 చోట్ల కేసులు నమోదైన క్రమంలో ఈడీ దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/JRNdrFX

Baca juga

Post a Comment